మధ్యయుగ భారతదేశం
ఉత్తర భారతదేశంలో రాజకీయ, సామాజిక పరిస్థితులు (క్రీ.శ.800-1200)
హర్షుడి మరణం తరవాత మళ్లీ ఉత్తర భారతదేశంలో వివిధ భూస్వామ్య రాజ్యాలు అవతరించాయి. ఈ భూస్వామ్యరాజ్యాలలో పశ్చిమ భారతదేశంలోని ప్రాతిహార, తూర్పు భారతదేశంలోని పాల రాజ్యాలు క్రీ.శ. 8వ శతాబ్దంలో అవతరించాయి. క్రీ.శ. 800-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశ చరిత్రను రెండు సుస్పష్టమైన దశలుగా విభజించవచ్చు.
- క్రీ.శ. 800-1000 మధ్యకాలంలో ఉత్తర భారతదేశ రాజకీయ చరిత్రలో పాల (తూర్పు), ప్రాతిహార (పశ్చిమం), రాష్ట్రకూట (దక్కన్) రాజులకు మధ్య ప్రముఖమైన సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తుంది.
- క్రీ.శ.1000-1200 సంవత్సరాల మధ్యకాలంలోని ఉత్తర భారతదేశ చరిత్రలో రాజపుత్ర రాజ్యాల అవతరణ, ముస్లిమ్ల దాడులు ప్రముఖంగా కనిపిస్తాయి.
పాలరాజులు తూర్పుభారతదేశంలో ప్రాబల్యం వహించారు. గూర్జర (నైరుతి రాజస్థాన్) అనే ప్రాంతానికి చెందిన ప్రాతిహారు లను గూర్జర ప్రాతిహారులని కూడా పేర్కొంటారు. సింధునుంచి రాజస్థాన్లోకి అరబ్బుల చొరబాట్లను ప్రతిఘటించడం వల్ల ప్రాతిహారులు ప్రాముఖ్యంలోకి వచ్చారు.పశ్చిమ భారతదేశంలోనూ, ఎగువ గంగానదీ లోయ ప్రాంతంలోనూ ప్రాతిహారులు ప్రాబల్యం వహించారు.రాష్ట్రకూటులు దక్కన్ లోనూ ఉత్తర, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రాబల్యం వహించారు. ఈ మూడు రాజ్యాలలో రాష్ట్ర కూట సామ్రాజ్యం సుదీర్ఘకాలం కొనసాగడమే కాకుండా ఆర్థిక, సాంస్కృతిక విషయాలలో ఉత్తర, దక్షిణ భారతదేశాలకు మధ్య వారధి రాజ్యంగా కూడా వ్యవహరించింది.
హర్షుడి కాలం నుంచీ కనౌజ్ పై ఆధిపత్యం కోసం పాల, ప్రాతిహార రాజులు పోరాటం సాగిస్తూ వచ్చారు. కనౌజ్, ఉత్తర భారతదేశంలో సార్వభౌమత్వ చిహ్నంగా రూపొందింది. వీరిలో ఎవ్వరూ తమ ఉనికికి ప్రమాదకరమైనంత శక్తిమంతంగా తయారుకాకుండా చూడటానికి రాష్ట్రకూటులు పదేపదే ఉత్తర భారతదేశంపై దండెత్తుతూ వచ్చారు.
ఆ కాలపు వివిధ వంశ రాజుల గురించి

బుక్మార్కు చేసుకోండి:
ఇవి ఏమిటి?